జగన్‌ సీఎం అయితే సైకిల్‌యాత్ర చేస్తానని మొక్కు

నల్లగొండ : వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేస్తానని 2018లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం కాకినాడ సమీపంలోని మాధవపట్నం గ్రామానికి చెందిన పడాల రమేశ్‌ ప్రకటించాడు. అనుకున్న విధంగానే వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యాడు. అన్నమాట ప్రకారం... రమేశ్‌ ఫిబ్రవరి 20న కశ్మీర్‌ నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించాడు. 32 రోజులుగా 3,700 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం లాక్‌డౌన్‌ కారణంగా నల్లగొండలో మార్చి 22న సైకిల్‌యాత్ర నిలిపివేసి సైకిల్‌ని నల్లగొండ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచి హైదరాబాద్‌ వెళ్లాడు. ఈనెల 14న లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే యాత్ర తిరిగి ప్రారంభించాలనుకున్నాడు. కానీ, కేంద్రం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించడంతో బుధవారం నల్లగొండకు వచ్చి తన సైకిల్‌ తీసుకొని తన స్వగ్రామం మాధవపట్నం బయల్దేరి వెళ్లాడు.