హైదరాబాద్: భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా వెలుగువెలిగాడు ఎంఎస్ ధోని. టీమిండియాకు ఫైనల్ ఫోబియా పోయింది ధోని నాయకత్వంలోనే.. అంతేకాకుండా మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ఏకైక సారథి కూడా అతడే. ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసి.. వారిలోని ప్రతిభను వెలికి తీశాడు. ఆటగాళ్లకు పూర్తి విశ్వాసం కల్పిస్తూ వారికి దిశానిర్దేశం చేసి టీమిండియా ఎన్నో అపూర్వ విజయాలు సాధించడానికి.. ఆ క్రికెటర్ల ఎదుగుదలకు బాటలు వేసిన బాటసారి. వికెట్ల వెనకాల ఉంటూ మైదానం మొత్తం తన కంట్రోల్లో ఉంచుకుంటూ వ్యూహాలు రచిస్తూ సహచర క్రికెటర్లుకు మార్గనిర్దేశం చేస్తుంటాడు. ఇదే విషయాన్ని టీమిండియా తాజా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా పేర్కొన్నాడు.‘బౌలర్ను అర్థం చేసుకునే సారథి ఉండాలని నేను గట్టిగా విశ్వసిస్తాను. అతడు(ధోని) బౌలర్ కెప్టెన్. ఈ విషయం నేను ఒక్కడినే కాదు ఇప్పటికే అనేకమంది బౌలర్లు పేర్కొన్నారు. వికెట్ల వెనకాల ఉంటూ మైదానం కొలతలు, ఫీల్డర్లు ఎక్కడెక్కడ ఉన్నారు, బ్యాట్స్మన్ ఆలోచన ఏవిధంగా ఉందని బౌలర్కు ధోని సలహాలిస్తుంటాడు. అదేవిధంగా బౌలర్పై ఎలాంటి ఒత్తిడి లేకుండా సూచనలిస్తుంటాడు. దీంతో బౌలర్ పని తేలికవుతుంది. అందుకే చాలా మంది బౌలర్లు ధోనిని ప్రశంసిస్తారు. ఐపీఎల్లో అనామక దేశ, విదేశ బౌలర్లు సైతం ధోని కెప్టెన్సీలో విజృంభించి వికెట్లు పడగొడుతుంటారు’అంటూ ధోనిపై ఓజా ప్రశంసల వర్షం కురిపించాడు.
అతడు బౌలర్ కెప్టెన్: ఓజా